- స్టాలిన్కు భారీ షాక్
- టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి
- మాజీ సీఎం పళని స్వామి విజయం
చెన్నై, మహా : తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొళత్తూర్లో ఓటమి పాలయ్యారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సృష్టించిన ప్రభంజనంలో డీఎంకే అధినేత ఓటమి చవిచూడటం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. కొళత్తూర్లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు… స్టాలిన్పై 8,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 22 రౌండ్ల పాటు ఓట్లు లెక్కించగా వీఎస్ బాబుకు 82,997 ఓట్లు పోలయ్యాయి. సీఎం స్టాలిన్ కు 74,202, అన్నాడీఎంకే అభ్యర్థి సంతాన కృష్ణన్ కు 18,430 ఓట్లు లభించాయి. ఈ ఓటమితో డీఎంకే శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
మరోవైపు, ఉత్తర చెన్నైలోని రాయపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి, ఓ ఆటో డ్రైవర్ అయిన విజయ్ ధాము సంచలన విజయం సాధించారు. ఇక్కడ ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి. జయకుమార్తో పాటు డీఎంకే అభ్యర్థి సుబేర్ ఖాన్ను ఆయన ఓడించారు. ఈ గెలుపును క్షేత్రస్థాయి సాధికారతకు ప్రతీకగా, మార్పు కోరుకుంటున్న ప్రజల స్పష్టమైన సందేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి తన నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో గెలుొందారు. దాదాపు 90 వేల పైచిలుకు ఓట్లతో ఆయన గెలిచారు. ముఖ్యమంత్రి ఓటమి, టీవీకే అనూహ్య విజయాలతో ఈ ఎన్నికలు తమిళనాడులో దశాబ్దాల ద్విముఖ ఆధిపత్యానికి తెరదించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








