Mahaa Daily Exclusive

  భూ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలు…

Share

  • భూ కుంభకోణం, మనీ లాండరింగ్ ఆరోపణలు
  • పంజాబ్ లో ఈడీ రైడ్స్
  • 9వ అంతస్థు నుంచి నోట్ల కట్టలు విసిరివేసిన అగంతకులు
  • 12 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

ఛండీఘడ్, మహా పంజాబ్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాల్లో గురువారం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. మొహాలీ-ఖరార్ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన సోదాల సందర్భంగా నాటకీయ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఓ ఫ్లాట్ నుంచి నోట్ల కట్టల సంచులను కిందకు విసిరేయడంతో, రాష్ట్రంలో ఓ భారీ మనీలాండరింగ్, హవాలా నెట్‌వర్క్ నడుస్తోందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఈ కుంభకోణంలో పలుకుబడి కలిగిన బిల్డర్లు, రాజకీయ సంబంధాలున్న వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భూ కుంభకోణం కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఖరార్‌లోని వెస్టన్ టవర్ భవనానికి చేరుకున్నారు. అధికారులు లోపలికి ప్రవేశించిన కొద్ది క్షణాల్లోనే 9వ అంతస్తులోని ఓ ఫ్లాట్ నుంచి నగదుతో నిండిన సంచిని కిందకు విసిరేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాల్లో రూ.500 నోట్ల కట్టలు ఎగరడం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనతో ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వెలుపల తీవ్ర గందరగోళం నెలకొంది. కింద పడిన సంచిని వ్యాపారవేత్త నితిన్ గోహల్‌కు చెందిన డ్రైవర్ తీసుకెళ్లి, అధికారుల కళ్లుగప్పి వాహనంలో పరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈడీ బృందాలు ఆ డ్రైవర్, వాహనంతో పాటు నగదు కదలికలపై ఆరా తీస్తున్నాయి.

ఉదయం సమయంలో వాకింగ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు కాంప్లెక్స్‌లో అక్కడక్కడా పడి ఉన్న కరెన్సీ నోట్లను చూసి అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఈడీ అధికారులు ఆ సంచులను స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతంలో గంటల తరబడి సోదాలు కొనసాగించారు. విచారణలో భాగంగా అధికారులు రెండు సంచులను భవనంపై నుంచి విసిరేసినట్లు గుర్తించారు.

12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

ఈ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మొహాలీ-చండీగఢ్ బెల్ట్‌లోని దాదాపు 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సన్‌టెక్ సిటీ ప్రాజెక్ట్, అజయ్ సెహగల్, ఏబీఎస్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్టస్ బిల్డర్స్, ధీర్ కన్‌స్ట్రక్షన్స్ వంటి పలు సంస్థలు, వ్యక్తులపై ఈడీ దృష్టి సారించింది. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (జీఎంఏడీఏ) ద్వారా భూ వినియోగ మార్పిడి (సీఎల్‌యూ) అనుమతుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఈ కేసులో ఉన్నాయి.

కొందరు బిల్డర్ల బృందాలకు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులకు మధ్య వ్యాపారవేత్త నితిన్ గోహల్ సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఈడీ అనుమానిస్తోంది. పంజాబ్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సంబంధాలున్న వారి పేర్లు కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ కేసుపై ఈడీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఎత్తున సాగిన ఆర్థిక అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా స్పందిస్తూ పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భవనంపై నుంచి సంచులు విసిరేస్తున్న దృశ్యాలంటూ కొన్ని వీడియోలను ఆయన పంచుకోగా, అవి వైరల్‌గా మారాయి.