- విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు
- 1.621 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
- 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం
- రికార్డు స్థాయి డిమాండ్ ఉన్నా నిరంతరాయ సరఫరా
- వర్షాకాలం వేళ విద్యుత్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మహా
విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సౌధలోని జెన్ కో ప్రధాన కార్యాలయంలో బుధవారం ఇంధన శాఖ అధికారల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా డీఏను పెంచే ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం పచ్చ జెండా ఊపారు. విద్యుత్ ఉద్యోగులకు 1.621 శాతం మేర డీఏను పెంచుతూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651% నుంచి 19.272% కి చేరినట్లు అయింది. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ. 9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. విద్యుత్ రంగ సంస్థల్లో పని చేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు ఈ డీఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు. ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో గరిష్ట డిమాండ్ ఎదురైనా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసిన అధికారులను, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కోలు అత్యంత సంసిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూంచించారు. ప్రధానంగా క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో సీఎండీ హరీష్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, ట్రాన్స్మిషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, ట్రాన్స్ కో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీమతి లతా వినోద్ ఇతర విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.








