ఇరాన్కు అమెరికా ఘాటు హెచ్చరిక!
* ఒప్పంద నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.
* మళ్లీ సైనిక చర్యలకు సిద్ధమన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్.
* సముద్ర దిగ్బంధనాన్ని అమలు చేసే సామర్థ్యం మాకుంది.
బ్రస్సెల్స్,మహా.
అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని హామీలను ఇరాన్ గనుక సరిగ్గా పాటించకపోతే, ఆ దేశంపై మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గురువారం హెచ్చరించారు. నాటో రక్షణ మంత్రుల సమావేశం అనంతరం బ్రస్సెల్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒప్పందం అమలు, చర్చల సమయంలో ఇరాన్ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చల గడువులోగా ఇరాన్ చెప్పినట్లు చేయకపోతే, తాము మళ్లీ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటామని దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఒకవేళ ఇరాన్ నిబంధనలు పాటించకపోతే, అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసే పూర్తి సామర్థ్యం తమకు ఉందని పీట్ హెగ్సెత్ తేల్చిచెప్పారు.
అమెరికా-ఇరాన్ మధ్య దాదాపు 3 నెలలకు పైగా సాగిన తీవ్ర ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతోనే ఇటీవల ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో శతృత్వానికి ముగింపు పలకడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపుతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియను ప్రారంభించడం వంటి కీలక అంశాలు ఉన్నాయి.
ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ, ఒప్పందం ద్వారా లభించే ఆంక్షల సడలింపు, ఇతర ప్రయోజనాలు వంటివి ఇరాన్ తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే అమలులోకి వస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాజా వ్యాఖ్యలతో, ఒప్పందం అమలు సమయంలో ఇరాన్ తీసుకునే ప్రతి చర్యను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్లు మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని “పనితీరు ఆధారిత ఒప్పందం”గా పేర్కొంటున్నారు. ఇందులో ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల, ఇతర చర్యలన్నీ ఇరాన్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి.
అయితే ఇరాన్ నిధుల విడుదల, సముద్ర ఆంక్షల సడలింపు వంటి హామీలను ఏ క్రమంలో అమలు చేయాలనే విషయంలో రెండు పక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఘర్షణల సమయంలో హోర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. దీనివల్ల అనేక నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఒప్పందంతో ఆ ప్రాంతంలో సముద్ర రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వాషింగ్టన్ భావిస్తోంది. అదే సమయంలో ఇరాన్ ఒప్పంద నిబంధనలు పాటించకపోతే, సైనిక, ఆర్థిక ఒత్తిడిని మళ్లీ తీసుకురావచ్చునని అమెరికా స్పష్టం చేసింది.








