- సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ ధర్మపురి
- అప్పటికే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారన్న ఎంపీ
- నిజా నిజాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్
నిజామాబాద్, మహా : కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, ఇంటి మనిషి కవిత బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావుల మీద చేసిన అవినీతి, క్విడ్ ప్రో కో ఆరోపణల మీద సీబీఐ చేత వెంటనే విచారణ జరిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫినిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అర్వింద్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని, వీటిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సంస్థ సీబీఐ తో దర్యాప్తు జరిపించాలని ఆయన సీఎంను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద దర్యాప్తును సీబీఐకి అప్పగించడంలో జరిగిన జాప్యం, ఈ-కార్ రేసులో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలున్నా విచారణ చేపట్టకుండా కేటీఆర్ ని రక్షించడం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం బాధ్యులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోపోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకిస్తున్నారని, కాంగ్రెస్- బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని అర్వింద్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని, పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.








