- మహిళా భద్రతకు “సహచరి”
- మల్కాజిగిరి పోలీసులు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం
- తెలంగాణ పోలీసింగ్లో నూతన అధ్యాయానికి నాంది
- ‘సహచరి’ అమలులో సెర్ప్ భాగస్వామ్యం
హైదరాబాద్, మహా : సమాజంలో మహిళల భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావిస్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఒక విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి ఆధ్వర్యంలో ప్రారంభమైన “సహచరి” కార్యక్రమం తెలంగాణ పోలీసింగ్కు సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది. మహిళల రక్షణ, సాధికారత, కుటుంబ సంక్షేమం, సామాజిక భద్రత అనే నాలుగు ప్రధాన స్తంభాలపై రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం, పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు మహిళల్లో భద్రతా భావనను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో సెర్ప్ ను భాగస్వామ్యం చేయడం విశేషం. మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, పోలీస్ శాఖ, స్థానిక సమాజం కలిసి పనిచేసే సమగ్ర నమూనాగా
“సహచరి” రూపొందింది. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కాదు… సమస్యలు తలెత్తకుండా ముందుగానే నివారించడం, బాధిత మహిళలకు అండగా నిలవడం, అవసరమైన చట్టపరమైన, మానసిక, సామాజిక సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.








