- ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి
- వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి
- రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్ లు కొనుగోలు చేయాలి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా : హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పై సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్ లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్టుగా మెట్రో రైల్ కు అదనపు బోగీలను జత చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ కోచెస్ ను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో ఫేజ్-2 లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
డిసెంబర్ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్ లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్ లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.








