- తెలంగాణలో 736 కేజీబీవీలకు అనుమతి
- పార్లమెంట్ లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకు
- మెదక్ జిల్లాకు 26 మంజూరు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం
న్యూఢిల్లీ, మహా : తెలంగాణకు మొత్తం 736 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీలకు) ఆమోదం తెలిపినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇందులో 26 కేజీబీవీలను మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో సర్వశిక్షా అభియాన్, సమగ్ర శిక్ష పథకాల నిధుల వినియోగంపై మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు. కేజీబీవీలతో పాటు పాఠశాల విద్యకు సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, మెజారిటీ పాఠశాలలు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రత్యక్ష నిర్వహణలోనే పనిచేస్తాయని గుర్తుచేశారు. స్థానిక అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు వార్షిక ప్రణాళిక, బడ్జెట్ను సిద్ధం చేస్తాయని మంత్రి వివరించారు. ఈ ప్రణాళికలను ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమగ్రంగా పరిశీలించి, పథకం మార్గదర్శకాలు, బడ్జెట్ కేటాయింపులకు లోబడి ఆమోదం తెలుపుతుందని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధారిత పాఠశాలల్లో బాల్వాటిక నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వేడివేడిగా, పౌష్టికాహారాన్ని అందించే పూర్తి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ఆహార భద్రత, పరిశుభ్రత, పారిశుధ్య తనిఖీలు నిర్వహించడంతో పాటు వంటవారికి, సహాయకులకు శిక్షణ, సామర్థ్య పెంపు కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రమంత్రి తెలిపారు. పీఎం పోషణ్ కింద సకాలంలో ఆహార ధాన్యాల సరఫరా, వంట ఖర్చులను భరిస్తున్నామని, అలాగే పీఎం పోషణ్ ఎంఐఎస్, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.






