Mahaa Daily Exclusive

  మారుతున్న సవాళ్లు..! పోలీసు సిబ్బంది పునర్వ్యవస్థీకరణ..: డిజిపి సి. వి. ఆనంద్‌..

Share

  • మారుతున్న సవాళ్లు
  • పోలీసు సిబ్బంది పునర్వ్యవస్థీకరణ
  • డిజిపి సి. వి. ఆనంద్‌
  • ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
  • గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ నుంచి 513 మంది ఇతర విభాగాలకు బదిలీ
  • డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి
  • రెండు నెలల అటాచ్‌మెంట్‌ అనంతరం సిబ్బందికి కొత్త బాధ్యతలు

హైదరాబాద్‌, మహా : మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన సమావేశంలో డిజిపి సి. వి. ఆనంద్‌ తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు పోలీసులకు కొత్త సవాళ్లుగా మారాయని చెప్పారు.

513 మందికి కొత్త బాధ్యతలు

గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ తదితర ప్రత్యేక విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎనిమిది విభాగాలకు అవసరాలకు అనుగుణంగా కేటాయించారు. వీరిలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, 22 మంది ఎస్‌ఐలు, 14 మంది ఏఎస్‌ఐలు, 84 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. ఆహార కల్తీ, డ్రగ్‌ కంట్రోల్‌కు 80 మంది, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 79 మంది, సివిల్‌ సప్లయిస్‌కు 28 మంది, డిజిపి కార్యాలయం–టి-స్పార్క్‌కు 27 మంది, ఏసీబీ, సీఐడీ, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలకు 25 మంది చొప్పున కేటాయించారు. కొత్త బాధ్యతలు అప్పగించే ముందు సిబ్బందిని వివిధ విభాగాల్లో రెండు నెలల పాటు అటాచ్‌మెంట్‌పై పనిచేయించామని డిజిపి తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆయా విభాగాల్లో పోస్టుల ఏర్పాటు ఆధారంగా తుది కేటాయింపులు చేశామన్నారు. సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, నేపథ్యాన్ని పరిశీలించడంతో పాటు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు చెప్పారు. కొత్త విభాగాల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 11 రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

తీవ్రవాదం నుంచి సైబర్‌ నేరాల వరకు

తెలంగాణలో 1980, 1990 దశకాల్లో వామపక్ష తీవ్రవాదం తీవ్రంగా ఉండేదని డీజీపీ గుర్తుచేశారు. అప్పటి పరిస్థితుల్లో ప్రత్యేక పోలీసు బలగం అవసరమై 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో కేఎస్‌ వ్యాస్‌ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పడిందని తెలిపారు. అదే క్రమంలో గ్రేహౌండ్స్‌ రూపుదిద్దుకుందని చెప్పారు. గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ తదితర విభాగాలు మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. 2017 తర్వాత తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, అయితే ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవల కర్రెగుట్టల ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపించిందని, కొన్ని ప్రాంతాల్లో రహదారులు, పాఠశాలలు, వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. 2007లో హైదరాబాద్‌లో లుంబినీ పార్క్‌, చార్మినార్‌ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రత్యేక కౌంటర్‌ టెర్రరిజం సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, దాని ఫలితంగా ఆక్టోపస్‌ వంటి ప్రత్యేక విభాగాలు అభివృద్ధి చెందాయని డిజిపి వివరించారు.

విద్యార్థులపై డ్రగ్స్‌ పంజా

యువతలో డ్రగ్స్‌ వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని డిజిపి అన్నారు. గతేడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. మరో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు డ్రగ్స్‌కు గురైనట్లు తేలిందని చెప్పారు. డ్రగ్స్‌ సరఫరా గొలుసును పూర్తిగా అడ్డుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను ఇప్పుడే కాపాడుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సైబర్‌ నేరాల్లో రూ.1,750 కోట్ల నష్టం

సైబర్‌ నేరాలు మరో ప్రధాన సవాలుగా మారాయని డిజిపి తెలిపారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పెట్టుబడి మోసాలు, నకిలీ యాప్‌ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది తెలంగాణలో సైబర్‌ నేరాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు తెలిపారు. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రోడ్డు భద్రతకు పెద్దపీట

తాజా పునర్వ్యవస్థీకరణలో రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. గత ఏడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణ, అమలును మరింత బలోపేతం చేసేందుకు 224 మంది సిబ్బందిని ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు సేఫ్టీ విభాగానికి కేటాయించినట్లు తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటికి సంబంధించిన ఇంజినీరింగ్‌ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రోడ్డు భద్రత కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు. శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. కొత్త బాధ్యతలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుని క్రమశిక్షణతో, వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని సూచించారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల్లో ఫీల్డ్‌ ఆపరేషన్లు, నిర్వహణ, శిక్షణ తదితర అవసరాలకు సరిపడా సిబ్బందిని కొనసాగించినట్లు డిజిపి తెలిపారు. మూడు నెలల అనంతరం సిబ్బంది అవసరాలు, పనితీరును మరోసారి సమీక్షిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆక్టోపస్‌, సీఐడీ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌ తదితర ప్రత్యేక విభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Latest