ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరగాలని జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే అధికారులను ఆదేశించారు. బుధవారం హన్మకొండ నక్కలగుట్ట మునిసిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న సంక్షేమ పథకాలైన (రైతు భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్లు) విధి విధానాలపై సమీక్షించారు.
ఈ నెల 21 నుంచి 25 వరకు గ్రామ సభలు పక్కాగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, వార్డు సభల్లో అందించే అర్జీలను స్వీకరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని, విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో హన్మకొండ జెడ్పి సీఈఓ, నోడల్ అధికారి విద్యాలత, జిల్లా పౌరసరఫరాల అధికారి కొమురయ్య,ఉప కమిషనర్ రవీందర్ , తహశీల్దార్లు, సర్వే బృందాలు తదితరులు పాల్గొన్నారు.








