కింగ్ కోహ్లీ. మ్యాచ్ ను గెలిపించడమే కాకుండా రికార్డుల రారాజుగా నిలిచిపోయాడు. అభిమానులంతా తనను ఎందుకు కింగ్ అంటారో.. పాకిస్థాన్ ను ఛాంపియన్స్ ట్రోఫీలో చిత్తుచేసి మరీ నిరూపించాడు. చిరుత పులిలా పరుగులు తీసి రికార్డుల దాహం తీర్చుకున్నాడు. తన సెంచరీతో పాకిస్థాన్ ను ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తరిమికొట్టడమే కాకుండా.. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కొహ్లీ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి 15 పరుగులు వద్ద ఈ మైలురాయిని దాటాడు. సచిన్, సంగక్కరల రికార్డులను సైతం బ్రేక్ చేశాడు. సచిన్ టెండుల్కర్ 350 ఇన్నింగ్స్లో 14 వేల పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లి 287 ఇన్నింగ్స్లోనే 14 వేల పరుగులు దాటాడు. ఇప్పటివరకు వన్డేల్లో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే 14 వేల కన్నా ఎక్కువ పరుగులు చేశారు. తాజాగా కోహ్లి మూడో స్థానంలోకి చేరుకున్నాడు. ఇందులో సచిన్ టెండుల్కర్ 18,426 పరుగులు, కుమార సంగక్కర 14,234 పరుగులు, విరాట్ కోహ్లి (భారత్) 14,002 పరుగులు చేసినవాళ్లుగా ఉన్నారు.
కింగ్ ముందు.. రికార్డులు బలాదూర్
భారత్ ఆటగాళ్ళలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ ముందున్నాడు. ఇందులో సచిన్ ను దాటేసి ముందుకు వెళ్ళిపోయాడు విరాట్. సచిన్ తన మొత్తం కెరీర్ లో 49 సెంచరీలు చేయగా…కింగ్ కోహ్లీ మాత్రం ఇప్పటికే 51 సెంచరీలు చేసి భారత బ్యాటర్లలో అత్యధిక సెంచరీల వీరుడిగా నిలిచాడు. ఇంకా కొన్నాళ్ళు ఆడతాడు కాబట్టి మరిన్ని సెంచరీలు చేస్తాడు. అలా అయితే విరాట్ ను చేరుకోవడం ఎవరి వల్లా కాదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. యంగ్ క్రికెటర్లు ఎంతో కష్టపడితే కానీ కింగ్ కోహ్లీని చేరుకోవడమే కష్టం అని అంటున్నారు. కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో ఘనత కూడా తన కీర్తి కిరీటంలో పెట్టుకున్నాడు. విరాట్ కోహ్లి టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా నిలిచాడు. ఇంతకు ముందు ఉన్న మహ్మద్ అజారుద్దీన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లి 158 క్యాచ్లతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో మహ్మద్ అజారుద్దీన్-156 , మూడో స్థానంలో సచిన్ టెండుల్కర్-140 ఉన్నారు. ఈ రికార్డులు సాధించడమే కాకుండా భారత్ తాజా విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.








