Mahaa Daily Exclusive

  గొప్ప మనసున్న జగ్గన్న క్యాన్సర్ పేషెంట్‌కి సాయం.. రూ.10 లక్షల సాయం చేసిన జగ్గారెడ్డి..!

Share

ఎన్నికల వేళ ఊరూపేరూ తెలియని బంధువుల్లా వచ్చిపోయే నాయకులే ఎక్కువ. గెలిచాక ప్రజల గోడు వినేందుకు తీరిక లేని వారు కోకొల్లలు. ఇలాంటి కఠోరమైన పరిస్థితుల్లోనూ కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వేళ్ల మీద లెక్కించదగ్గ ఇలాంటి నాయకుల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఒకరు. తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి పరిష్కరించే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. తాజాగా సదాశివపేట మండలంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక నిరుపేద మహిళ గురించి తెలుసుకున్న వెంటనే ఆయన చూపిన మానవత్వం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ గత కొంతకాలంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన, తక్షణ వైద్య ఖర్చుల కోసం తనవంతు సహాయంగా రూ.10 లక్షల నగదును అందజేశారు. అంతేకాకుండా.. ధైర్యం కోల్పోయిన కుటుంబ సభ్యులకు ఆయన మనోధైర్యాన్ని నింపారు. తన భర్త చనిపోయాడని, ఇద్దరు చిన్న ఆడపిల్లలతో దిక్కులేని జీవితం గడుపుతున్నానని ఆమని తన గోడును జగ్గారెడ్డి ముందు వెళ్లబోసుకుంది. ఈ భరించలేని నరకం నుంచి విముక్తి పొందడానికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని.. కానీ తన పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతున్నానని ఆమె కన్నీటి పర్యంతమైంది.

ఈ విషాదకరమైన పరిస్థితిలో జగ్గారెడ్డి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిదని ఆయన కొనియాడారు. తనకు సహాయం చేసి.. దానిని వీడియోలు, ఫోటోలు తీసి ప్రచారం చేసుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఈ నిరుపేద మహిళ పడుతున్న కష్టం పది మందికి తెలియాలని.. తద్వారా మరికొంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చానని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే, కనీసం చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడటానికి దాతలందరూ ముందుకు రావాలని ఆయన వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు, సరైన వైద్యం కోసం వారు పడుతున్న కష్టాలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను గుర్తుంచుకుని.. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే తన కర్తవ్యమని ఆయన మరోసారి నిరూపించారు. జగ్గారెడ్డి లాంటి నాయకులు నేటి సమాజానికి ఆశాకిరణం లాంటివారు.