వరంగల్ రజతోత్సవ సభలో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. పదేళ్లుగా తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తెలంగాణను ఆగం చేశారని ధ్వజమెత్తారు. రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని చెప్పి అన్నదాతలను మోసం చేశారన్నారు. 24 గంటల కరెంట్ ను ఆగం పట్టించారన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో భూముల ధరలు బాగా పెరిగాయని.. ఇప్పుడు కొనే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ సర్కార్ అసమర్థతే కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. తన ప్రసంగంలో ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే.. కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఏ ఒక్క కాంగ్రెస్ నేత పేరు కూడా ప్రస్తావించలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.








