భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి జిల్లాలో మండలాల వారీగా ఫ్లడ్ యాక్షన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
వర్షాకాలంలో వరదలు ఎప్పుడు సంభవించిన ప్రజలకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో వరద సహాయక చర్యలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, పశు సంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యా, అగ్నిమాపక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
గ్రామాలు, మండలాల వారిగా వరద సహాయక చర్యలపై కార్యా చరణ ప్రణాళికలు తయారు చేయాలని,ముంపు గ్రామాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలానికి ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం సిద్దం చేయాలని పునరావాస కేంద్రాల ఏర్పాటులో ప్రాధాన్యతగా ఫంక్షన్ హాళ్లు, రైతు వేదికలు, అవసరమైతే పాఠశాలలను ఉపయోగించాలని సూచించారు.
ఇరిగేషన్ అధికారులు చెరువుల పటిష్టతను పరిశీలించి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, చెరువు కట్టల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. 2022-23 వరద అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీరు రహదారులపై చేరిన సందర్భాలలో బారికేడింగ్ ఏర్పాటు చేసి, ప్రజల రాకపోకలను నియంత్రించాలని, తగు జాగ్రత్తలతో అత్యవసర సేవలు మినహా ప్రయాణాలు నిలిపివేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రసవ సమయం దగ్గరలో ఉన్న గర్భిణీ మహిళలను గుర్తించి ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. అత్యవసర వైద్య సేవలకు. మందులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అవసరమైన ఔషధాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి ప్రజల రక్షణకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలతో పాటు పశువుల రక్షణ కూడా చాలా ముఖ్యమని, వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల నుండి ఎత్తయిన ప్రదేశాలకు తరలించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు, వరదలు వచ్చినపుడు విద్యుత్తు ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని, ముందస్తుగా మంచినీటి పైపులు, కుళాయిలు పరిశీలించి లేకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నివేదిక ఇవ్వాలని, ఆర్ అండ్ బి అధికారులు ధ్రువీకరణ తదుపరి కూల్చివేత చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయతి, మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని తెలిపారు. వరదల సమయంలో అత్యవసర సేవలకు కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర సేవలకు అగ్నిమాపక, ఎస్డీఆర్ ఎఫ్ టీములు సిద్ధంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డిఓ రవి, డిఎస్పీ సంపత్ రావు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, విద్యా, పంచాయతి రాజ్, విద్యా, వైద్య, డిఆర్డీఓ, అగ్నిమాపక శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.








