ఆదిలాబాద్ మహా : సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో గొప్పదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5 న నిర్వహించే గురుపూజోత్సవాన్ని ఒక రోజు ముందుగానే నిర్వహించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంచార్జ్ జిల్లా విద్యా శాఖాధికారి, ఖుష్బూ గుప్తా,డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రాలతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తును రూపొందించడంలో, వారి వ్యక్తిగత అభివృద్ధికి, మంచి పౌరులుగా ఎదగడానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారన్నారు .దేశాభివృద్ధి లోనూ వారి పాత్ర ఎంతో ముఖ్యమైనదని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నిస్వార్థ సేవను గుర్తించడానికి గురుపూజోత్సవాన్ని జరుపుకుంటామన్నారు.జిల్లాలో విద్యలో అనేక ఆధునిక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లలో ఏఐ విద్యా బోధన మరి కొన్ని స్కూళ్లలో డిజిటల్ కోడ్ కూడా తీసుకురానున్నట్టు చెప్పారు. అలాగే ప్రీ ప్రైమరీ స్కూలింగ్ కూడా కొన్ని స్కూళ్లలో ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా చదువు బోధించి జాతి నిర్మాతలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.






