- జూబ్లీహిల్స్లో గెలుపు మనదే
- కాంగ్రెస్కు సానుకూల వాతావరణం
- టైం లేదు ప్రచారంలో మరింత దూకుడు పెంచాలి
- ఏ నిర్లక్ష్యం కూడా వద్దు.. పార్టీ నేతలు కలిసికట్టుగా పని చేయాలి
- బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడుతూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి
- అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి
- సమీక్షా సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ కీలక సూచనలు
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాగే ఉప ఎన్నికలో విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్కు సమయం దగ్గరపడుతున్న వేళ, క్యాంప్ను పటిష్టం చేయడానికి ఆయన మంత్రులు, కీలక నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, అలాగే పలువురు మంత్రులు హాజరయ్యారు. గెలుపు తమదేనని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్ల సానుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మిగిలిన మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల బరిలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఫేక్ సర్వేలను విడుదల చేస్తూ ప్రజలను, ఓటర్లను గందరగోళానికి గురిచేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం..
ఈ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని, వాస్తవాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వానికి సీఎం సూచించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. గెలుపు అంచనా వేయడంతో పాటు, పోలింగ్ రోజు నిర్వహణపైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ఎన్నికలో విజయం సాధించాలంటే పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం అని ఆయన నొక్కి చెప్పారు. పోలింగ్ బూత్ల స్థాయిలో సమన్వయం, ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకురావడం, ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం వంటి అంశాలపై మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధికి చేయబోయే కృషిని..
నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి, పార్టీ అభ్యర్థి పట్టుదల గురించి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. సమావేశంలో అంతర్గత సర్వేల నివేదికలను సైతం సీఎం సమీక్షించినట్లు సమాచారం. గెలుపు అవకాశాలు బలంగా ఉన్న ప్రాంతాలు, మెరుగుపడాల్సిన చోట్ల దృష్టి సారించేందుకు మంత్రులకు డివిజన్ల వారీగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వపరంగా జూబ్లీహిల్స్ అభివృద్ధికి చేయబోయే కృషిని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్ను కైవసం చేసుకోవాలనే స్పష్టమైన లక్ష్యంతో నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు





