Mahaa Daily Exclusive

  సైబర్ ఉచ్చులో హైదరాబాద్ యువతి…

Share

  • సైబర్ ఉచ్చులో హైదరాబాద్ యువతి
  • మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్
  • రూ. 1.45 లక్షలు వసూలు

హైదరాబాద్, మహా : సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న బ్లాక్‌మెయిల్ ఉచ్చులో తాజాగా హైదరాబాద్‌ యువతి చిక్కుకుంది. గోషామహల్ పరిధిలోని గౌలిగూడకు చెందిన 26 ఏళ్ల యువతి బాధితురాలిగా మారింది. సైబర్ నేరగాళ్లు ఈ యువతికి సంబంధించిన మార్ఫింగ్‌ చేసిన అశ్లీల వీడియోలను పంపి భయపెట్టి దశలవారీగా ఆమె నుంచి రూ. 1.45 లక్షల వరకు వసూలు చేశారు. ఈ వేధింపుల పర్వం గత నెల అక్టోబర్ 10న ప్రారంభమైంది. బాధితురాలికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. అందులో ఆమె రూ.7 వేల రుణం తీసుకున్నారని వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. ఆ మహిళ తాను ఎప్పుడూ రుణం తీసుకోలేదని ఖండించినప్పటికీ సైబర్ నేరగాళ్లు ఆమెకు నిరంతరం ఫోన్లు, సందేశాలు పంపిస్తూ తీవ్రంగా వేధించారు. వేధింపులు భరించలేక, బాధితురాలు ఆ మొత్తాన్ని చెల్లించింది. తర్వాత కూడా నేరగాళ్ల వేధింపులు ఆగలేదు. మరింత డబ్బు లాగడానికి వారు తమ పద్ధతిని మార్చుకున్నారు. ఆమె ముఖాన్ని ఉపయోగించి తయారు చేసిన మార్ఫింగ్‌ చేసిన అశ్లీల వీడియోలను బాధితురాలికి పంపారు. ఆ వీడియోలను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తామని బెదిరించారు. పరువు పోతుందన్న భయంతో, సామాజికంగా ఎదురయ్యే సమస్యలకు భయపడి బాధితురాలు నిస్సహాయంగా వారి డిమాండ్లకు అంగీకరించింది. ఈ విధంగా ఆమె మొత్తం రూ. 1.45 లక్షలు వారికి బదిలీ చేసింది. నిరంతర వేధింపులు, పదే పదే ఫోన్ కాల్స్ కొనసాగడంతో బాధితురాలు చివరకు తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించింది. వారి మద్దతుతో ఆమె హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి, పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

Latest