- యూపీఎస్ సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల
- 979 పోస్టులకు ఎంపికైన 2736 మంది
- ఇంటర్వ్యూ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్ నయూపీఎస్ సీ
న్యూఢిల్లీ, మహా : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల మెయిన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని యూపీఎస్ సీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే తుది దశ ఇంటర్వ్యూకి పిలుస్తారు. కాగా తాజా ఫలితాల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్ రౌండ్)లకు ఎంసికైనట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూకి కలిపి వచ్చిన మొత్తం మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఫైనల్గా వచ్చిన మార్కుల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ అయిన గ్రూప్ ‘ఏ’ గ్రూప్ ‘బి’ వంటి పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఆర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీని త్వరలోనే యూపీఎస్సీ ప్రకటించనుంది. ఈ ఇంటర్వ్యూలు న్యూఢిల్లీ షాజహాన్ రోడ్లో ఉన్న ధోల్పూర్ హౌస్లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) షెడ్యూల్ తదనుగుణంగా అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) ఈ-సమ్మన్ లెటర్లు కూడా తగిన సమయంలో అందుబాటులో ఉంచుతారు, వీటిని కమిషన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను కమిషన్ ఎంపిక చేయనుండగా. 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వూలకు హాజరుకానున్నారు.








