మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
తెలంగాణకు చెందిన నలుగురు మృతి
మృతుల్లో ఒక బాలిక’
తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు
ముంబై, మహా : మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు. చంద్రపూర్ జిల్లాలోని దేవదా తహసీల్లోని సోండో గ్రామ శివార్లలోని వంతెన పై నుంచి వాగులోకి కారు దూసుకెళ్లడంతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పట్టణానికి చెందిన ముగ్గురు మహిళలు, ఒక బాలిక అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కాగజ్నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జకీర్ భార్య సల్మా బేగం, వారి కుమార్తె షబ్రీమ్, బంధువులు అఫ్జా బేగం, సహారలు నాగ్పూర్లోని ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా సోండో గ్రామ శివార్లలోని వంతెనపై నుంచి కారు పడింది. దీంతో కారు కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో నలుగురు అక్కడికక్కడే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బంధువులు కూడా గాయపడ్డారు.
జకీర్ అనే ఆటో రిక్షా డ్రైవర్ మాట్లాడుతూ.. గాయపడిన వారిని చంద్రపూర్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నాగ్పూర్ నగరంలోని ఒక ఆసుపత్రికి వైద్య అత్యవసర పరిస్థితి కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించడంతో కాగజ్నగర్లో విషాదం అలుముకుంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






