Mahaa Daily Exclusive

  మేడారం సాక్షిగా చారిత్రక కేబినెట్: మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్!

Share

  • మున్సిపల్ ఎన్నికలు
  • జిల్లాల పునర్విభజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
  • మేడారం సమ్మక్క సాక్షిగా మంత్రివర్గ సమావేశం
  • తెలుగురాష్ట్రాల చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్

మేడారం, మహా : మేడారం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగ్గా, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు, జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ముందుగా నిర్ణయించి.. అనంతరం లాటరీ పద్ధతిలో మహిళలకు.. బీసీలకు స్థానాలను కేటాయించారు. . జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతామని.. వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తామన్నారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందన్నారు. పక్కా ప్రణాళికతో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టత ఇచ్చారు. ఆదివారం కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం జరిగింది.

మహా జాతర ఏర్పాట్ల పరిశీలన

అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం జరిగిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి పరిశీలించారు. చరిత్ర చెదిరిపోకుండా, సంస్కృతి సాంప్రదాయం వర్ధిల్లేలా, భక్తుల విశ్వాసం ద్విగుణీకృతం అయ్యేలా… ఆచారాలు శాశ్వతంగా నిలిచేలా… సమ్మక్క – సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్లైనా నిలిచిపోయేలా మేడారంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను సహచర మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వాటి పనితీరును పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి, అజారుద్దీన్ , తుమ్మల నాగేశ్వరరావు తదితర 13మంది హాజరయ్యారు.