హైదరాబాద్, మహా : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనకు బయలుదేరింది. అక్కడ ఈనెల 23 వరకు జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)-2026 సదస్సులో సీఎం బృందం పాల్గొననుంది. అయితే సీఎం దావోస్ పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ‘ఎక్కే విమానం – దిగే విమానం అన్నట్లుగా సీఎం దావోస్ ట్రిప్ ఉందని విమర్శించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి అని సీఎంను ఎక్స్ వేదికగా కవిత ప్రశ్నించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో వచ్చినట్టు మీరు, మీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారు. దావోస్ సమ్మిట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చేసుకున్న ఎంవోయూలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.








