- హైదరాబాద్ రోడ్లు
- ఆదివారం టెర్రర్
- ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో ఆందోళనకరమైన అంశాలు
హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగర రహదారులు మృత్యుకూపాలుగా మారుతున్న తీరుపై ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తాజా అధ్యయనం అత్యంత ఆందోళనకరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. గతేడాది నగరంలో నమోదైన 2,801 ప్రమాద కేసులను విశ్లేషించినప్పుడు, వాహనదారుల మానసిక స్థితి మరియు ప్రయాణ సమయాలకు ప్రమాదాలకు మధ్య ఉన్న విడదీయలేని సంబంధం స్పష్టమవుతోంది. రహదారులు ఖాళీగా కనిపించగానే వేగాన్ని నియంత్రించలేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కనీస నిబంధనలు పాటించకుండా దూసుకెళ్లడం వంటి అంశాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం, వారంలో అన్ని రోజుల కంటే ఆదివారం (448 కేసులు) సోమవారం (433 కేసులు) అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నట్టు నిర్ధారించారు. ముఖ్యంగా వారాంతాల్లో మద్యం మత్తులో వాహనాలు నడపడం, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా, ఉదయం మరియు మధ్యాహ్న సమయాల్లో కూడా ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం. పోలీసుల నివేదిక ప్రకారం, ప్రమాదాల వివరాలు: ఆదివారం: 448 సోమవారం: 433 మంగళవారం: 413 బుధవారం: 371 గురువారం: 356 శుక్రవారం: 372 శనివారం: 408 గా క్షేత్రస్థాయిలో పోలీసులు జరిపిన దర్యాప్తులో మృతుల్లో మరియు క్షతగాత్రుల్లో ద్విచక్ర వాహనదారులే అధికంగా ఉన్నట్లు తేలింది.
అతివేగం, నిర్లక్ష్యం
ఖాళీగా ఉన్న రోడ్లపై వేగాన్ని నియంత్రించలేక వాహనాలు ఢీకొంటున్నారు. రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకెళ్లడం వల్ల కూడళ్ల వద్ద ఘోరాలు జరుగుతున్నాయి. వారాంతాల్లో ‘కిక్’ కోసం తాగి బండి నడపడం మృత్యువును ఆహ్వానించడమే అవుతోంది. బహదూర్పుర ఫ్లైఓవర్ వంటి ఘటనల్లో మైనర్లు వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. రాంగ్ రూట్, గల్లీల నుంచి ఒక్కసారిగా మెయిన్ రోడ్డుపైకి రావడం ప్రమాదాలకు దారితీస్తోంది. పెరుగుతున్న ఈ మరణాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ‘ఎరైవ్- ఎలైవ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ఉల్లంఘనులపై కఠినమైన కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడిన వారికి జైలు శిక్షలు విధిస్తూ, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.








