Mahaa Daily Exclusive

  పోలీస్ ఫుట్‌బాల్‌లో సీఐఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ జైత్రయాత్ర..!

Share

  • హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించేలా ప్రపంచస్థాయి సదుపాయాలు.
  •  చైనాను మించిన వసతులు.. స్టేడియాల్లో బిగ్ స్క్రీన్స్.. ఐటీ ఉద్యోగులకు క్రీడా విందు.
  •  గోల్డెన్ బూట్ విజేతలుగా బిజయ్ బెహెరా, ప్యారీ జెజె, మీనా ఖాతున్.

హైదరాబాద్ , మహా.

భాగ్యనగర వేదికగా గత పదిహేను రోజులుగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన 74వ బి.ఎన్. మల్లిక్ స్మారక అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఆదివారం ఘనంగా ముగిసింది. పురుషుల విభాగంలో సీఐఎస్‌ఎఫ్ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుతూ బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల విభాగంలో అస్సాం రైఫిల్స్ జట్టు విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగిన ఈ క్రీడా సంబరంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర బలగాల నుంచి వచ్చిన జట్లు తమ ప్రతిభను కనబరిచాయి. పురుషుల విభాగంలో గోవా రన్నరప్‌గా నిలవగా, కేరళ జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో ఒడిశా రన్నరప్‌గా, సీఐఎస్‌ఎఫ్ మూడవ స్థానంలో నిలిచాయి. వ్యక్తిగత ప్రతిభలో ఒడిశాకు చెందిన బిజయ్ బెహెరా 8 గోల్స్‌తో ‘గోల్డెన్ బూట్’ గెలుచుకోగా, మహిళల విభాగంలో ప్యారీ జెజె (ఒడిశా), మీనా ఖాతున్ (ఎస్‌ఎస్‌బీ) తలో 7 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచారు.

ముగింపు వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర క్రీడా భవిష్యత్తుపై అద్భుతమైన దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా ప్రపంచ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లను హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయికి మన మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. క్రీడా వసతుల కల్పనలో పొరుగు దేశమైన చైనాను మించిన సదుపాయాలను ఇక్కడ కల్పిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియాలను ఆధునీకరిస్తామని వెల్లడించారు. ప్రపంచస్థాయి శిక్షణ, వసతులు అందుబాటులోకి వస్తేనే మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై బంగారు పతకాలు సాధించగలరని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

యువతను, ముఖ్యంగా నగరంలోని లక్షలాది మంది ఐటీ మరియు ఇతర రంగాల ఉద్యోగులను క్రీడల వైపు ఆకర్షించేందుకు వినూత్న ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయని, అందుకే స్టేడియాల్లో ఐపీఎల్ తరహాలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు, గ్యాలరీల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తామన్నారు. స్టేడియాలకు రావడం ఒక పండుగలా అనిపించేలా వాతావరణాన్ని మారుస్తామని, తద్వారా యువత డిజిటల్ వ్యసనాలకు, ఇతర తప్పుడు మార్గాలకు దూరమై ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ మరియు పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మించబోయే ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని, క్రీడల్లో రాణించే బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాల గ్యారెంటీ ఇస్తామని సీఎం పునరుద్ఘాటించారు.

Latest