Mahaa Daily Exclusive

  ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్….

Share

  • ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్
  • ప్రతి నెలా కొలువుల జాతర
  • సన్నద్దమవుతున్న టీజీపీఎస్సీ
  • త్వరలోనే 2500 పోస్టుల భర్తీకి చర్యలు

హైదరాబాద్, మహా : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ ( టీజీపీఎస్సీ ) అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక నుంచి ప్రతీ నెల ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 2500 ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు రకాల ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. మిగతా పోస్టుల భర్తీకి ప్లాన్ చేస్తోంది.

ఇప్పటి నుంచి నోటిఫికేషన్లను జారీ చేయడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా.. అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కసరత్తులు చేపట్టింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సుమారు 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్ తయారు చేసే పనిలో టీజీపీఎస్సీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఈనెల 27వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే అదే విభాగంలోనే మరో 6, 7 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపట్టింది. వీటితోపాటు కీలకమైన టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు.. పలు శాఖల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి కూడా కమిషన్ అధికారులు దృష్టి సారించారు. ఇక విద్యా శాఖలోనూ డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లై విభాగాల్లోని పలు పోస్టుల భర్తీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. రకరకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా.. పరీక్షలు నిర్వహించడంలోనూ సరికొత్త విధానాన్ని పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇతర రాష్ట్రస్థాయి ఉద్యోగాలతోపాటు.యూపీఎస్సీ, ఎస్ఎస్‌‌‌‌సీ వంటి నేషనల్ లెవల్ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని.. టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌‌‌‌ను తయారు చేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ పరీక్షలు రాసే నిరుద్యోగులకు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయనుంది.

ఓటీఆర్ అప్ డేట్ తప్పనిసరి అంటున్న అధికారులు

వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌‌డేట్‌ చేయాలని ఇప్పటికే టీజీపీఎస్సీ పేర్కొన్నా.. చాలామంది నిరుద్యోగులు మాత్రం చేసుకోకపోవడం గమనార్హం. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా.. వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్‌‌‌‌గా పలు పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటీఆర్ అప్‌‌డేట్ చేసుకోవాలని.. అందుకు గడువు 2 సార్లు పెంచినా ఇప్పటికీ కేవలం 6 లక్షల మంది మాత్రమే అప్‌డేట్ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపాయి.