- ఎన్టీఆర్కు భారతరత్న తెలుగువారి ఆకాంక్ష
- తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా ఎన్టీఆర్
- లోకేష్ ప్రతిపాదించిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు మనమే ప్రారంభిద్దాం
- మహానాడులో చంద్రబాబు
అమరావతి, మహా :-తెలుగుజాతికి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశరాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గురువారం మహానాడు రెండో రోజున ఎన్టీఆర్ కు నివాళి అర్పించే తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని సీఎం అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. ప్రజల మనస్సుల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయ స్థానం సంపాదించారన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం పనిచేసిన మహోన్నత నేత ఎన్టీఆర్ అని, భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టం…అపూర్వం అని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ఎన్టీఆర్కు భారత రత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఎన్టీఆర్ ఖ్యాతి మరెవరికీ సాధ్యం కాదు
తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ జయంతి తెలుగువారందరికీ పండుగ రోజు అని చంద్రబాబు అన్నారు. సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, సినీ జీవితంతో పాటు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఎదిగారన్నారు. ఎన్టీఆర్ మళ్లీ పుడితే తప్ప ఆయన క్రమశిక్షణ, ఆయన ఖ్యాతి మరెవరికీ సాధ్యం కాదన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా తెలుగువారి ఆత్మగౌరవం కోసమే జీవించారని, రైతుబిడ్డ నుంచి సినిమాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల వరకూ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారని చంద్రాబాబు ప్రస్తుతించారు. ఎన్టీఆర్ పేరు తలుచుకుంటేనే పట్టుదల, ఆత్మవిశ్వాసం వస్తుందని, ఆయన పేరు తలచుకుని సంకల్పం చేస్తే చాలు దేనికీ తిరుగు ఉండదన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన లాంటి నాయకుడు మరొకరు లేరని, ఆయన మొదట సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగంలో చేరి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన స్థాపించిన ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషిచిందని చంద్రబాబు అన్నారు.
ప్రజల మనస్సుల్లో ఎన్టీఆర్ది చిరస్మరణీయ స్థానం
‘”ఎన్టీఆర్ పాలన రైతులకు అండ, మహిళలకు భరోసా, కార్మికులకు అభయం, యువతకు దిక్సూచి అయ్యింది. సమాజమే దేవాలయం…ప్రజలే దేవుళ్లు అనే నినాదాన్ని శాశ్వత విధానంగా ఎన్టీఆర్ మార్చారు. తెలుగుదేశం జెండా ఆడబిడ్డలకు అండ, రైతన్నలకు భరోసా, యువతకు విశ్వాసం. 1983లో రాజకీయాల్లో యువతకు ఎన్టీఆర్ అవకాశాలు కల్పించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. భవిష్యత్లో పార్టీకి సమర్ధ నాయకత్వం ఉండేలా భవిష్యత్ కార్యాచరణ చేపడుతున్నాం. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ మహానాడు తోలిరోజున ప్రతిపాదించిన 33 శాతం రిజర్వేషన్ను మనమే ప్రారంభిద్దాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రాన్ని మరోమారు కోరదాం.” అని చంద్రబాబు అన్నారు.








