- మమతకు మరో షాక్
- అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రెబల్ ఎమ్మెల్యే
- ఆదేశాలు జారీ చేసిన స్పీకర్
కోల్ కత్తా, మహా : పశ్చిమబెంగాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా సిబ్బంది రితబ్రతకు ఇచ్చేశారు. అసెంబ్లీలో పార్టీ నేతగా శోభన్దేబ్ ఛటోపాధ్యాయ్ను తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఎంపిక చేయడంతో పార్టీలో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ మొత్తం 80 ఎమ్మెల్యేల్లో 59 మంది తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆ తరువాత రితబ్రత సారథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. తామే టీఎంసీ అని, రితబ్రతకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తాజాగా రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, తమ నాయకురాలు మమతా బెనర్జీనేనని రితబ్రత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీని చీల్చే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదన్నారు. శోభన్దేబ్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ గత వారం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జి మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పీకర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కానీ, స్పీకర్ ఈ లేఖను తిరస్కరించారు. ఈ లేఖలోని తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఎమ్మెల్యేలు రితబ్రత, సాందీపన్ ఆరోపించడంతో స్పీకర్ శోభన్దేబ్కు ప్రతిపక్ష నేత గుర్తింపును ఇవ్వలేదు.







