Mahaa Daily Exclusive

  గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో.. నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతా..-: సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..

Share

  • గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో
  •  నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతా
  • .. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
  • – విద్యార్ధులకు సన్నబియ్యంతో మంచిఅన్నం పెట్టాలి
  • – ఫుడ్ పాయిజన్ ఘటనలు రిపీట్ కావొద్దు
  • – ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట పునరుద్దరించాలి
  • – ప్రజాప్రభుత్వంలో విద్యకు ఎనలేని ప్రాధాన్యత
  • సంక్షేమ పథకాలు పెంచడానికే సమగ్ర సర్వే
  • అధికారులు వారంలో రెండుసార్లు పాఠశాలలు సందర్శించాలి
  • వచ్చే ఏడాదిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

మహా, హైదరాబాద్: గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టినా, క్వాలిటీ లేని వస్తువులను సరఫరా చేసినా బాధ్యులను జైలు ఊచలు లెక్కపెట్టిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి అన్నం పెట్టాలని, దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయాలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన ఘటనలు తాను వార్తల్లో చూస్తున్నానని, ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో బాలల దినోత్సవం కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. గురుకుల పాఠశాలలను తక్కువ అంచనా వేయొద్దన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం ఏ సన్న బియ్యం తింటున్నారో అవే బియ్యంతో గురుకుల విద్యార్థులకు భోజనం పెట్టాలనేది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పదేళ్లుగా పెంచకుండా ఉంచిన డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలను తాము పెంచామన్నారు. పదేండ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని, కానీ మా ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధులు పెంచామన్నారు. ప్రజా ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయిందని, ఇక్కడి నుంచే ప్రజా ఉత్సవాలను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థను బాగు చేయడానికి విద్యాకమిషన్ ఏర్పాటు చేశామన్నారు. నాడు కేసీఆర్ మనువడు పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్లను జైల్లో వేశారని, కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేయాలని సూచించారు. వచ్చే ఏడాదిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు అందుబాటులోకి తెస్తామని, బడ్జెట్‌లో 7 శాతంపైగా నిధులు విద్యాశాఖకు కేటాయించామన్నారు.

 

ప్రతిష్ట పునరుద్దరించాలి

 

ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఆ ప్రతిష్ఠ పునరుద్ధిరంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రైవేట్ పాఠశాలల కంటే అన్నిరకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు నా సూచన, తప్పకుండా పాఠశాలలను పరివేక్షించండి. వాళ్ల సమస్యలను తెలుసుకోండి. అదేవిధంగా కలెక్టర్లు సహా జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షించకుంటే వారి ప్రమోషన్ల విషయంలో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

 

కులగణన.. మెగా హెల్త్ చెకప్‌లాంటిది

 

సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కులగణన సర్వే జరుగుతున్నదని సీఎం చెప్పారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలని సూచించారు. కులగణన ఎక్స్ రే కాదు.. మెగా హెల్త్ చెకప్ లాంటిదన్నారు. కులగణన ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, దీనిపై అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ఎవరి సంక్షేమ పథకాలు తొలగించబోమని స్పష్టంచేశారు. కొందరు ఈ అంశంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

ఎమ్మెల్యేకు పోటీ వయసు తగ్గించాలి

 

ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సు 25 ఏళ్ల నుంచి 21కి తగ్గించాలని సీఎం రేవంత్ అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ అసెంబ్లీకి పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు నిబంధన అలాగే ఉంచారు. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పని చేస్తున్నప్పుడు 21 ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేగా కూడా రాణిస్తారని తాను బలంగా నమ్ముతున్నాను’ అని చెప్పారు.

Latest