Mahaa Daily Exclusive

  పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు..! ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా..

Share

  • హర్మూజ్ జల సంధిలో సురక్షితమైన నౌకాానమే లక్ష్యమంటున్న అమెరికా
  • దూషణలతో కాదు చేతలతో చూపిస్తామంటున్న ఇరాన్

మహా : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. బుధవారం ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిలో సురక్షితమైన నౌకాయానాన్ని కల్పించడమే ఈ దాడుల లక్ష్యమని అమెరికా సైన్యం చెబుతోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన మధ్యంతర ఒప్పందం ఇప్పుడు ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా ప్రకటించిన తర్వాత మరింతగా అమెరికా రెచ్చిపోయింది.

 

బుధవారం ఇరాన్‌పై తాజాగా దాడులు చేసినట్టు అమెరికా సైన్యం తెలిపింది. మంగళవారం హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న మూడు సరకు రవాణా నౌకలపై దాడి జరిగిన తర్వాత ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. దాడులకు ప్రతిస్పందనగా సైనిక చర్యను తీవ్రతరం చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ దాడుల అనంతరం, ఇరాన్ దక్షిణ తీరంలోని పలు నగరాల్లో పేలుళ్లు వినిపించాయి, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఇరాన్‌పై అదనపు సైనిక చర్యను ప్రారంభించింది. ఇటీవల వాణిజ్య నౌకలు, వాటిలోని పౌర సిబ్బందిపై జరిగిన దాడులకు ఇరాన్‌ కారణమని అమెరికా పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గాల్లో ప్రయాణించే నౌకల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది.

 

వరుసగా రెండో రోజు కూడా దాడులు

 

అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్‌కు చెందిన పలు స్థావరాలపై సైనిక దాడులు చేసింది. అమెరికా అధికారుల ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఆపాలని ఇరాన్‌పై ఒత్తిడి తేవడమే ఈ దాడుల లక్ష్యం. ఆక్సియోస్ అనే వార్తా వెబ్‌సైట్ ప్రకారం, ఈ అంతర్జాతీయ జలమార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర సిబ్బంది భద్రత కోసం ఈ చర్య అవసరమని అమెరికా చెబుతోంది.

 

అమెరికా దాడులు ఆగ్నేయ ఇరాన్‌లోని ఇరాన్‌షహర్‌లో ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసీ) సల్మాన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్‌షహర్‌తోపాటు, అమెరికా దాడులు దక్షిణ ఇరాన్‌లోని చబహార్, కొనరాక్, బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖేష్మ్ సహా పలు ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి.

నివేదికల ప్రకారం, దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో గల చోఘ్‌డాక్ సమీపంలో ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కు చెందిన ఒక సైనిక స్థావరంలో అగ్నిప్రమాదం జరిగింది. అమెరికా వైమానిక దళం, నౌకాదళం జరిపిన దాడుల కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణం అధికారికంగా ధృవీకరించలేదు.

 

తమ దక్షిణ ప్రాంతంలో శత్రు డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన

 

ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు దేశంలోని దక్షిణ భాగంలో ఒక ‘శత్రు’ డ్రోన్‌ను విజయవంతంగా కూల్చివేశాయని మెహర్ న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ డ్రోన్‌ను ధ్వంసం చేశారు. అయితే, ఆ డ్రోన్ ఏ దేశానికి చెందినది లేదా ఏ ఉద్దేశంతో పంపారు అనే విషయంపై క్లారిటీ లేదు.

 

ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి ఎదురుదాడి

 

ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ దూషణలతో కాకుండా చేతలతో ప్రతిస్పందిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్ ప్రజల గొప్పతనాన్ని, గౌరవాన్ని, సంకల్పాన్ని తగ్గించలేవని పేర్కొన్నారు. ఇరాన్ తన జాతీయ ప్రయోజనాలను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఎలాంటి ఒత్తిడికి గానీ, అవమానకరమైన మాటలకు గానీ తలొగ్గబోదని విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు.

Latest