హైదరాబాద్, మహా.
మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్రావు నిజంగా నీటిపారుదల రంగంలో అంత నిష్ణాతుడైతే, ఆయన సొంత మామ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మొదట్లో మంత్రి పదవి నుంచి తొలగించారని ప్రశ్నించారు. హరీశ్రావుపై కేసీఆర్కే పూర్తి నమ్మకం లేకపోవడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
గురువారం సచివాలయంలో మీడియాతో అనౌపచారికంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీశ్రావు ఇటీవల చేసిన విమర్శలకు సమాధానమిచ్చారు. నీటిపారుదల అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో దెబ్బతిన్న భాగాల మరమ్మతు పనులు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిందని మంత్రి తెలిపారు. వచ్చే వేసవి నాటికి ఈ మరమ్మతు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తనకు మంత్రి పదవి ఇవ్వాలని హరీశ్రావు అంటున్నారని వ్యాఖ్యానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చెప్పినట్లుగా హరీశ్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు తెరలేపారు.
హరీశ్రావు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై తగిన సమయంలో పూర్తి వివరాలతో సమాధానం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిందని, ప్రజలకు మేలు చేసే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.








