Mahaa Daily Exclusive

  హర్మూజ్ దాడులపై భారత్ తీవ్ర ఆగ్రహం…ఇరాన్‌కు అధికారిక నిరసన….

Share

ఢిల్లీ, మహా.
అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. యూఏఈకి చెందిన ఎంటీ అల్ బహియా, ఎంటీ మొంబాసా నౌకలపై జరిగిన దాడుల్లో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, పలువురు భారతీయులు గాయపడిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ ఇరాన్‌కు అధికారిక నిరసన తెలిపింది. ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహమ్మద్ జావాద్ హొస్సేనీని విదేశాంగ శాఖ పిలిపించి నిరసన నమోదు చేసింది.

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, హర్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన నౌకాయానానికి ఆటంకం కలిగించే దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. వాణిజ్య నౌకలను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో మళ్లీ హింసాత్మక ఘటనలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, తక్షణమే ఘర్షణలు నిలిపివేసి దౌత్యపరమైన చర్చలకు తిరిగి రావాలని భారత్ పిలుపునిచ్చింది.

ఒక భారతీయుడు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

విదేశాంగ శాఖ వివరాల ప్రకారం, రెండు నౌకల్లో మొత్తం 46 మంది సిబ్బంది ఉండగా వారిలో 30 మంది భారతీయులు ఉన్నారు. అల్ బహియా నౌకలో పనిచేస్తున్న 12 మంది భారతీయుల్లో ఒకరు దాడిలో మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మొంబాసా నౌకలో ఉన్న 18 మంది భారతీయుల్లో తొమ్మిది మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భారత్, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

భారతీయులకు అన్ని విధాల సహాయం

బాధిత భారతీయ నావికులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భారతీయుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

వాణిజ్య నౌకలపై దాడులు ఆగాలని భారత్ పిలుపు

పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, సైనికేతర మౌలిక వసతులపై దాడులు వెంటనే నిలిపివేయాలని భారత్ కోరింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన నౌకాయానం, వాణిజ్య కార్యకలాపాలు వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గమని, అక్కడ శాంతి, స్థిరత్వం నెలకొనడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో అవసరమని పేర్కొంది.

యూఏఈ తీవ్ర స్పందన

మరోవైపు, తమ దేశానికి చెందిన చమురు ట్యాంకర్లపై జరిగిన దాడులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ, దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ఇరాన్ వెంటనే ఇలాంటి దాడులను నిలిపివేసి, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను నిర్బంధం లేకుండా కొనసాగేందుకు సహకరించాలని యూఏఈ కోరింది.