- 12 మందికి కరోనా పాజిటివ్
- నలుగురు మృతితో కలకలం
అమరావతి, మహా : భారత్లో మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో నలుగురు బాధితులు మృతి చెందారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా బారిన పడిన మరణించిన వారిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారని, వారంతా ఇదివరకే తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో (కో-మార్బిడిటీస్) బాధపడుతున్నారని వీరపాండియన్ స్పష్టం చేశారు. వైరస్ జన్యు క్రమ స్వరూపాన్ని విశ్లేషించేందుకు 5 శాంపిల్స్ సేకరించి పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు.
కడపలో అత్యధిక కరోనా కేసులు
ఏపీలో నమోదైన మొత్తం కోవిడ్19 కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు, రాష్ట్ర సర్వైలెన్స్ విభాగం ఇప్పటికే అన్ని బోధనాసుపత్రులు, జీజీహెచ్లు, డీఎంహెచ్వోలకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా మందులు, ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో రోగుల నుంచి కరోనా పరీక్షల కోసం స్వాబ్ నమూనాలను సేకరించేందుకు అవసరమైన వీటీఎం కిట్లు, వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.








