Mahaa Daily Exclusive

  అత్యవసర సేవలకు ‘100’ కాదు ఇక నుంచి – ‘112’

Share

  • అత్యవసర సేవలకు ‘100’ కాదు ఇక నుంచి – ‘112’
  • డయల్ 112 సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
  • ఒకే గొడుగు కిందకు పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు

హైదరాబాద్, మహా : తెలంగాణలో అన్ని అత్యవసర సేవల కోసం రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్​ డయల్​ 112 సేవలను అధికారికంగా ప్రారంభించారు. 100 పోలీస్​, 101 అగ్నిమాపక, 108 వైద్య సేవలను ఒకే గొడుగు కింద 112 ద్వారా అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 112కు బాధితులు ఫోన్​ చేయగా వారి పరిష్కారానికి సిబ్బంది మానిటరింగ్​ చేస్తోంది. అత్యవసర సమయాల్లో, ఆపద కాలంలో అండగా ఉండేందుకు 112 సేవలను, ఏఐ ఆధారిత కాల్​ సిస్టమ్​ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో 3-4 నిమిషాల్లో స్పందించగా ఇక నుంచి 2 నిమిషాల్లోనే రియల్​ టైమ్​ రెస్పాన్స్​ ఇస్తుంది. ఈ కార్యక్రమంలో డీజీలు విక్రమ్​ సింగ్​ మాన్​, శ్రీనివాస్​, కమల్​ హాసన్​ రెడ్డి, సీపి రమేష్​ రెడ్డి, సుమతి, సజ్జనార్​, జాయింట్ సీపీ గజరావ్​ బోపాల్​, సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్​ సికా గోయల్​, సీఐడీ చీఫ్​ చారు సిన్హా పాల్గొన్నారు.

112 కాల్​తో మొత్తం 18 సేవలు

112కు సంబంధించి విజయవంతంగా పరీక్షలన్నీ పూర్తి చేసి బుధవారం ప్రారంభించారు. పోలీస్​, మెడికల్​, ఫైర్​, విమెన్​ సమస్యలు, హైడ్రా కోసం 112 లో యాడ్​ చేశారు. చైల్డ్​ హెల్ప్​లైన్​, డిజాస్టర్​ మేనేజ్మెంట్​, ఎలక్ట్రిసిటీ, జీహెచ్​ఎంసీ లాంటి 18 సేవలు 112కు డయల్​ చేస్తే ఫాల్​ అప్​ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి, సకాలంలో సేవలు అందేలా పోలీసులు చూస్తున్నారు. అంతేకాదు ఎన్​ఆర్​ఐ డెస్క్​ కూడా అందుబాటులోకి తెచ్చి వారి సమస్యలు 112కు కాల్​ చేస్తే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు..112కి ఓ కాలర్​ లైవ్​ కాల్​ చేసి గొడవలు అల్లర్లు జరుగుతున్నాయని చెప్పగా వెంటనే సమీప పోలీస్​ స్టేషన్​కు ఫాల్​ అప్​ చేశారు. సకాలంలో స్పందించినందుకు కాలర్​ హర్షం వ్యక్తం చేశారు.
“దిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కేంద్రం నిధులు కేటాయించి సుప్రీం జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. విదేశాల్లో అన్నిఅత్యవసర సేవలకు ఒకే నంబర్ ఉంటుందని, అదే మాదిరిగా మనదేశంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీ సూచించింది. భారత్​లో 112 ప్రామాణిక నంబర్​గా ఉండాలని ప్రతిపాదించింది. మనదేశంలో ఫైర్​, మెడికల్, పోలీస్ సేవల కోసం ఇన్ని నంబర్లు ఉంటే ప్రజలు గుర్తించుకోవడం చాలా కష్టమని సూచించింది. ఈ నేపథ్యంలోనే డయల్​ 112 సేవలను ప్రారంభించడం జరిగింది. నేరనియంత్రణకు ఇది చాలా ఉపయోగపడుతుందని డీజీపీ సీవీ ఆనంద్​ తెలిపారు.

కృత్రిమ మేధ ఆధారిత 112 సేవలు

ప్రస్తుత టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధ ఆధారిత 112 సేవలు అందుబాటులో తెచ్చింది. 100,112కు కాల్​ చేసిన వెంటనే ఆపరేటర్​ కాల్​ లిఫ్ట్​ చేసి లైవ్​ లోనే వెంటనే స్పందించి సంబంధిత శాఖలకు బదిలీ చేస్తున్నారు. దేశంలోనే తొలిసారి ఏఐ, మానవ వనరుల ఆధారిత 112 సేవలు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

అనేక సమస్యలకు డయల్​ 112 పరిష్కారం

కమాండ్​ కంట్రోల్​ సెంటర్ టవర్​ బీలో రెండు ఫ్లోర్​లను డయల్​ 112కి కేటాయించామని సీవీ ఆనంద్​ తెలిపారు. డయల్​ 100ను 2013లో కొంపల్లిలో జీవీకే వారి సాయంతో ప్రారంభించారు. వివిధ అత్యవసరాలకు ఒకే నంబర్​ ఉండాలని గతంలో కేంద్రం సూచించింది. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత టెక్నికల్​ డెవలప్​మెంట్​ చేస్తూ రావడంతో ఏఐ వచ్చాక అనేక పనులు సులువుగా మారాయని సీవీ ఆనంద్​ పేర్కొన్నారు. న్యాయ, వైద్య, సైబర్​ సాయం అనేక సమస్య పరిష్కారాలకు డయల్​ 112 పరిష్కార మార్గం అయింది.
అంతేకాకుండా డయల్​ 112 కాల్​ రాగానే కాలర్​ లొకేషన్​ కోసం అడ్వాన్స్​ టూల్స్​ వాడుతున్నట్లు తెలిపారు. డ్రోన్​ బెస్డ్​ టెక్నికల్​ సిస్టాన్ని త్వరలోనే తెలంగాణ పోలీసులు ఉపయోగించనున్నట్లు అన్నారు. అలాగే డ్రోన్​ టీమ్​ని సైతం ఫామ్​ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బేసిక్​ పోలీసింగ్​ లాగా టెక్నాలజీ పోలీసింగ్​ను తీసుకువస్తున్నారు. డయల్​ 112 అనేది 3.0 వర్షన్​గా ఉంటుంది. యువ ఐపీఎస్​లు, ఏఐ టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు సీవీ ఆనంద్​ తెలిపారు.