Mahaa Daily Exclusive

  ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం….

Share

ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం.
* ప్రజాస్వామ్యంలో ఎవరి చేతులూ కట్టేయలేం.
* డీలిమిటేషన్‌పై విపక్షాల నిర్ణయానికే కట్టుబడి ఉంటాం.
* పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే.

రుద్రపుర్‌, మహా.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లును పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమవారం జరగనున్న విపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో బిల్లుపై చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్న ఖర్గే రుద్రపుర్‌లో వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై తమ వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉందని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి చేతులనూ కట్టివేయలేమని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌ అంశంపైనా ఆయన స్పందిస్తూ.. తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉన్నప్పటికీ విపక్ష కూటమిలోని అన్ని పార్టీలతో చర్చించి తీసుకునే ఉమ్మడి నిర్ణయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

ప్రస్తుత ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు విదేశీ విరాళాలు పొందుతున్న సంస్థల ధ్రువపత్రం రద్దు లేదా ముగిసిన సందర్భంలో వాటి ఆస్తులు, విదేశీ నిధుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. బిల్లు 2026 మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టగా ప్రస్తుతం సభలో పెండింగ్‌లో ఉంది.

‘కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే పర్యటన’

ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని ఖర్గే తెలిపారు. తాను ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రతిరోజూ ప్రతి రాష్ట్రానికి వెళ్లలేనని, అయితే పార్టీకి అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

అయోధ్య విరాళాలపై మోదీ సమాధానం చెప్పాలి

అయోధ్య రామమందిరానికి సంబంధించిన విరాళాలు, ఆస్తుల దుర్వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాటు నుంచి ఆలయానికి సంబంధించిన పలు కార్యక్రమాల వరకు ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించిన విరాళాలు, ఆస్తుల వ్యవహారంపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీపై ఉందని అన్నారు.

రాహుల్‌ కార్యక్రమానికి ప్రశంసలు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న ‘ఛాత్రోంకీ గూంజ్‌’ కార్యక్రమాన్ని ఖర్గే ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం తీసుకురావడంలో రాహుల్‌ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, డిమాండ్లను తెలుసుకోవడం ద్వారా వారికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

విపక్షాల ఉమ్మడి వ్యూహం

ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బిల్లును ఉపసంహరించుకోవాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కోరగా, ఎన్‌సీపీ (ఎస్పీ) కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ నేతలు కూడా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.