- 100 శాతం టార్గెట్ ను రీచ్ కావాలిసిందే
- మూడు నెలల సమయం ఇస్తున్నాం
- పాల సరఫరాను విజయ డెయిరీ మెరుగు పరుచుకోవాలి
- పోషకాహార తెలంగాణే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
- ఆరోగ్య లక్ష్మీ పథకంపై మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, మహా: అంగన్ వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో ఎటువంటి గ్యాప్ లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేసారు. మారు మూల ప్రాంతాల్లోని అంగన్ వాడీ కేంద్రాలను సకాలంలో పాల సరఫరా జరగాల్సిందేనని స్పష్టం చేసారు. పోషకాహర తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మీ పథకంపై మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులతో కలసి మంత్రి సీతక్క సమీక్షించారు.
గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో బాగంగా ప్రతి రోజు 200 ఎం ఎల్ పాలను గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణి చేస్తారు. ప్రభుత్వ విజయ డెయిరీ టెట్రా ప్యాకెట్ల అంగన్ వాడీ కేంద్రాలకు సప్లై చేస్తుంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1.67 కోట్ల లీటర్ల సరఫరా కోసం ఆర్డర్ చేయగా…1.56 కోటి లీటర్ల పాలను విజయా డెయిరీ సరఫరా చేయగలిగింది. అంటే 94 శాతం మేర సప్లై చేయగలిగింది. అయితే కొన్ని అంగన్ వాడీ సెంటర్లకు సకాలంలో పాలు సప్లై కాకపోవడం పట్ల మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కోరినంత మేర పాలు సరఫరా చేయగలరా? లేదా? అంత సామర్ధ్యం ఉందా? లేదా? సరిపోయినంత సప్లై చేసే శక్తి లేకపోతే మీ ఇండెంట్ ను తగ్గించి ఇతర సంస్థల ద్వారా సప్లై చేసుకోవాలా అని విజయ డెయిరీ ప్రతినిధులను మంత్రి సీతక్క ప్రశ్నించారు. మరో మూడు నెలల పాటు అవకాశం ఇస్తామని, పాల సరఫరా సంతృప్తికరంగా లేకపోతే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. విజయ డెయిరీ రైతుల నుంచి పాలను సేకరిస్తుందని, అందుకే రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు విజయ డెయిరీ నుంచి పాలను కొనుగోలు చేస్తున్నామని గుర్తు చేసారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు తమకు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ అంతే ముఖ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేసారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాలకు జరిగే పాల సప్లై లో ఏలాంటి గ్యాప్స్ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసారు. ఆరోగ్య తెలంగాణ, పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా పనిచేయాలని ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పాల నాణ్యతను స్వయంగా రుచి చూసి మంత్రి సీతక్క పరిశీలించారు. పాల నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్త పరిచారు. ప్రస్తుతం లీటర్ టెట్రా ప్యాక్ ను రూ. 57 కి విజయ డెయిరీ సరఫరా చేస్తుంది. ధరలను సవరించాలని విజయా డెయిరీ ప్రతిపాదించగా మంత్రి తిరస్కరించారు. మూడు నెలల పాటు ఏలాంటి గ్యాప్స్ లేకుండా పాలను సరఫరా చేసిన తర్వాత మరో సారి సమీక్షించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేసారు.








