Mahaa Daily Exclusive

  2024లో హైడ్రా సాధించిన విజయాలు..

Share

  • 8 చెరువులు, 12 పార్కులను కాపాడాం
  • 5800 అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు అందాయి
  • కమిషనర్ రంగనాథ్

 

హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు, కుంటలు రక్షణతోపాటు ప్రభుత్వ స్థలాల రక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా ఏర్పడి నాటి నుంచి పలు అక్రమ నిర్మాణాలను కూల్చి సంచలనాలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని ఈ సందర్భంగా రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా చర్యల వల్ల ఎఫ్‍‌టీఎల్, బఫర్ జోన్లు, అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారన్నారు. హైడ్రా ఇప్పటి వరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందని రంగనాథ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దులు, బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నామని చెప్పారు.

 

ఎస్ఆర్ఎస్ఈతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని రంగనాథ్ వివరించారు. ఏరియల్ డ్రోన్ సర్వేలు కూడా తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని తెలిపారు. నాలాలకు సంబంధించి కూడా క్లిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. హైడ్రాకు ఇప్పటి వరకు 5800 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. డాప్లర్ రాడార్ ఉంటే ఖచ్చితమైన వాతావరణం అంచనాలు సేకరిస్తామని, దాని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణం సమాచారం తెలిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. హైడ్రా ఉన్నది కేవలం కూల్చేందుకే అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు. ఇళ్ల విషయంలో గతంలో కట్టిన వాటి జోలికి హైడ్రా పోదని రంగనాథ్ స్పష్టం చేశారు. అధికారికమైనా, అనధికారికమైనా గతంలో నిర్మించిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు. అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను మాత్రం ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు.

Latest