సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం క్రమంగా కోలుకుంటోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే అత్యంత కీలకమైన మంగళగిరి వంటి పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది.
ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించింది.
ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పని చేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ- వాళ్లు పర్యవేక్షించిన ప్రాంతాలు మారాయి.
ఈ మార్పులు చేర్పులను మరింత వేగవంతం చేశారు జగన్. ఈ నెలాఖరులో జిల్లాల పర్యటనలకు పూనుకున్నందున ఈలోగా బూత్ స్థాయి వరకు కమిటీల నియామకంపై కసరత్తు పూర్తవుతోంది. ఇప్పటికే పలువురు నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఖరారు చేశారు. జిల్లాలకు అధ్యక్షులనూ నియమించారు. ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలు కొనసాగుతున్నాయి.
దీనికి కొనసాగింపుగా ఉత్తరాంధ్రలో పలు నియోజకవర్గాలకు కొత్తగా కోఆర్డినేటర్లను నియమితులయ్యారు. అనకాపల్లి లోక్సభ సహా అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలు అపాయింట్ అయ్యారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ నియమితులయ్యారు. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు దక్కాయి. ఈ నియోజకవర్గం కోఆర్డినేటర్గా ఆయన అపాయింట్ అయ్యారు. మాడుగుల స్థానం మళ్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడికే లభించింది.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన భీమిలీ నియోజకవర్గం సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అపాయింట్ అయ్యారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి, పీ గన్నవరం కోఆర్డినేటర్గా గన్నవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబు నియమితులయ్యారు.








