Mahaa Daily Exclusive

  టన్నెల్ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి – మాజీమంత్రి హరీశ్ రావు

Share

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. టన్నెల్ ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రమాదం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. 8 మంది కార్మికులు ఏమయ్యారో తెలియకపోవడం చాలా ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ 8 మంది బతికి ప్రాణాలతో బయటకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. బాధ కలిగే అంశం ఏంటంటే.. ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారం ముఖ్యమైపోయిందన్నారు. సంఘటన జరిగి మూడు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లలేదని, హెలికాప్టర్ వేసుకుని మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మండిపడ్డారు. నిన్న హెలికాప్టర్ ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ దగ్గరికి వెళ్లారు, ఇవాళ హెలికాప్టర్ లేదని ఇంట్లో కూర్చున్నారు, ఇదేనా పద్ధతి అని నిలదీశారు. నీటిపారుదల శాఖ మంత్రి పోడు, ముఖ్యమంత్రి ఏమో ఇప్పటి వరకు అక్కడికి పోలేదు, ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నారన్నారు. ప్రాధాన్యత ఏంటి అని అడుగుతున్నా ఇది చాలా బాధ కలిగిస్తోందన్నారు.

మేము ప్రధాన ప్రతిపక్షంగా మా వాళ్లంతా అక్కడికి వెళ్దామని అనుకున్నాం కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మిలటరీ అక్కడ పని చేస్తున్నాయి, మేము అక్కడికి వెళ్లడం ద్వారా అక్కడ సాంకేతికంగా ఇబ్బంది కావొద్దని, సహాయక చర్యల్లో ఎక్కడా ఆటంకం కలగొద్దు అనే ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్షంగా మేుము కోఆపరేట్ చేస్తున్నామన్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు అక్కడ కూర్చుని రాజకీయాలు మాట్లాడటం దారుణమన్నారుయ. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ పని చేయలేదు, అందువల్లే మేము ముట్టుకోగానే ఇది కూలిపోయిందని అంటున్నారు, ఇంతకన్నా బుద్ధి తక్కువ మాటలు ఇంకేమైనా ఉంటాయా? చదువుకున్న వ్యక్తివి, కెప్టెన్ వి.. ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఆచితూచి మాట్లాడాలి, అవీ నిజాలు మాట్లాడాలని హరీష్ రావు ధ్వజమెత్తారు.

అనుకోకుండా కాళేశ్వరంలో జరిగితే అది లక్ష కోట్ల అవినీతి అయ్యిందన్నారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, అవినీతిమయమైపోయిందని రాహుల్ గాంధీ నుంచి ఉత్తమ్, రేవంత్ దాకా మాట్లాడారు. మరిప్పుడు జరిగిందేంటి? కాంగ్రెస్ కో నీతి? మాకో నీతి ఉంటుందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌస్ లు, 21 సబ్ స్టేషన్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 203 కిలోమీటర్ల టన్నెల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 530 మీటర్ల ఎత్తు లిఫ్ట్ లు, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం.. ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్నీ బాగున్నాయి. మూడు బ్యారేజీలలో ఒక బ్యారేజీలో 7 బ్లాకుల్లో ఒక బ్లాక్ లో ఒక పిల్లర్ కూలింది అంతే అని హరీష్ రావు తెలిపారు. దానికి మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రాజకీయం చేశారు. కాంగ్రెస్ వాళ్లు మా మీద అబద్దాలు చెప్పి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం కూలిపోతేనేమో బీఆర్ఎస్ తప్పు, బీఆర్ఎస్ అవినీతి, ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిపోతేనేమో ఇందులో మనుషుల తప్పేమీ లేదు ప్రకృతి వైపరిత్యం, కామన్ గా జరుగుతుంటాయి అని ఉత్తమ్ అంటున్నారని హరీష్ రావు నిప్పులు చెరిగారు.