ఉత్తరప్రదేశ్ వారణాసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ నీటి పారుదల శాఖ డీఈ వెంకటరామిరెడ్డి (46), ఆయన భార్య విలాసిని (40), మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి (42) ఉన్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న టిప్పర్ వాహనాన్ని కారు ఢీకొట్టడంతో వెంకటరామిరెడ్డి, విలాసిని, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వెంకటరామిరెడ్డి స్వస్థలం న్యాల్కల్ మండలం మామిడిగి కాగా, సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటున్నారు.
వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స, తక్షణ సహాయక చర్యలను అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. వీలైనంత తొందరగా త దేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.








