ముంబయిలో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ లో రిక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న మానవ్ శర్మ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుని తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలు వివరించాడు. భార్య వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని కన్నీటిపర్యంతమయ్యాడు. మానవ్ శర్మ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా. అతడికి ఏడాది క్రితం పెళ్లయింది. కాగా, మానవ్ శర్మ తన సెల్ఫీ వీడియోలో ఏమన్నాడంటే భార్య ప్రతి రోజూ మానసిక క్షోభకు గురిచేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు. ప్రపంచంలోని మగాళ్ల బాధలు కూడా పట్టించుకోవాలని, ఆడవాళ్ల చేతిలో చిత్రహింసలకు గురయ్యే తనలాంటి వాళ్ల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నాడు. మగాళ్ల తరఫున ఎవరో ఒకరు గళం విప్పాలని పిలుపునిచ్చాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన మానవ్ శర్మ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. కాగా, మానవ్ శర్మ ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకోగా, ఈ విషయం నేడు వెలుగులోకి వచ్చింది. ఈ ఆత్మహత్యకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.








