Mahaa Daily Exclusive

  ఈ విజయం చిరస్మరణీయం మా బాధ్యతను మరింత పెంచింది రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగాం – జి.కిషన్ రెడ్డి

Share

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఈ విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరికీ, ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించడం, ఇదే నియోజకవర్గం నుంచి ఉాపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలవడం గర్వకారణమన్నారు. ఈ విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన మేధావులకు, పట్టభద్రులకు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా మేధావులు మొదలుకుని అన్ని వర్గాలు, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయం ఒక నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే నిలబడ్డారని, మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల బీజేపీ గెలవడం, మరోచోట ఉపాధ్యాయ సంఘం విజయం సాధించడం.. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసహనానికి, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు మల్క కొమురయ్యని గెలిపిస్తే, పట్టభద్రులు చిన్నమైల్ అంజిరెడ్డిని విజయతీరాలకు చేర్చారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో విజయం సాధించడం మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు రాజీలేని పోరాటం చేస్తామని, ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.