Mahaa Daily Exclusive

  ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ నెరవేర్చలేదు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!

Share

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి కేసీఆర్‌ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనను నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేసి తన కూతురి పెళ్లికి కూడా వెళ్లకుండా చేశారని.. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తనదైన శైలిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తాను ఎన్నికల్లో ఇచ్చిన ఓ హామీని అమలు చేయలేదని అసెంబ్లీ సాక్షింగా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. “నేను కక్ష సాధింపునకు పాల్పడితే మీ కుటుంబం అంతా చంచల్‌గూడలో ఉండేవారు. ఎంపీగా ఉన్న నన్ను ఆరోజు చర్లపల్లి జైలుకు పంపారు. బిడ్డ పెండ్లి పత్రిక పెట్టుకునేందుకు కూడా పంపకపోతే సుప్రీం కోర్టు లాయర్ల ద్వారా కండీషన్ బెయిల్ తెచ్చుకున్నా ఎన్‌ కన్వెన్షన్‌లో పెండ్లి పత్రిక రాసుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడా జైలుకే వెళ్లా అని ఇన్నారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేశారన్న అభియోగంపై 16 రోజులు డిటెన్షన్‌ సెల్‌లో నన్ను నిర్బంధించారు. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. దేవుడు అన్ని చూస్తాడు అని వేచిచూశా. నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే వాళ్లు ఆస్పత్రి పాలయ్యారు.” అని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

“నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మీ కుటుంబంలో అందరూ జైలుకు వెళ్తారు. ఈ రోజు వరకు కూడా అక్రమ కేసులు పెట్టలేదు. పార్టీ ఆఫీసులో సొంత కూలీలతో పచ్చి బూతులు మాట్లాడించినా కక్ష సాధింపునకు పాల్పడలేదు. ఒక్కొక్కరి చెంపలు పగలగొట్టే శక్తి ఉన్నా సంయమనం పాటించాను. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..? కేసీఆర్‌ కుటుంబానికి జైల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టిస్తా అని ఎన్నికల హామీ ఇచ్చా, ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చలేదు.” అని సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదేళ్లు తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు రూ.16,908 కోట్లు రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ కింద రూ. 20 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. రైతుబంధు ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారని.. ఆ డబ్బును తాను ముఖ్యమంత్రి అయ్యాక చెల్లించానని తెలిపారు. మొదటి విడతలో రూ.7625 కోట్ల రైతుబంధు చెల్లించానని తెలిపారు.

రైతు భరోసా పథకం కింద రూ.12 వేల కోట్లు చెల్లించామని రేవంత్ రెడ్డి చెప్పారు. పేద రైతులకు వరి వేస్తే ఉరే అని ప్రచారం చేసి వారు మాత్రం వరి పండించి రూ.4500కు అమ్ముకున్నారని ఆరోపించారు. కానీ తాము మాత్రం వరి వేయమని రైతులను ప్రోత్సహించి బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఉచిత కరెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కరెంట్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరెంట్ అని గుర్తుంచుకోవాలన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులు తాము పది నెలల్లో చేసి చూపించామన్నారు. తనను సీఎంగా చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని.. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపరిహారం ఇవ్వలేదని, తాము నష్టపరిహారం చెల్లించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంత చేస్తున్నా నా కష్టాన్ని గుర్తించి ప్రతిపక్ష నాయకుడు కష్టపడి పనిచేస్తున్నానని చెప్పొచ్చు కదా అని ఆయన అన్నారు. రాష్ట్రానికి నాలుగు రకాలుగా అప్పు చేసుకునే అవకాశం ఉంటుందని, మూడు రకాల అప్పులు కలిపి తెలంగాణ ఏర్పడే నాటికి రూ.90,160 కోట్ల అప్పు ఉండేదని తెలిపారు. 1 డిసెంబర్ 2023 నాటికి అప్పు రూ.6,69,257 కోట్లు అని రేవంత్ రెడ్డి వివరించారు