Mahaa Daily Exclusive

  సభలో అప్పులు లేనిది ఎవరికి..? కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య మీరు గ్రేట్ భట్టి గారు…!

Share

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో వాడీ వేడీ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనసభలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిదానికి ప్రభుత్వం రాష్ట్రం అప్పుల పాలైందనడం సరికాదని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైంది అనడానికి ఆధారాలు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత పదేళ్ళలో ఏమీ చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు సగటు ఆదాయం రూ. 3500 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.18 వేల కోట్లు ఉందన్నారు. అమెరికా లాంటి దేశాలకు కూడా అప్పులు ఉంటాయని, అప్పులు లేని దేశం గాని రాష్ట్రం గాని ఉండవన్నారు. అమాటకొస్తే అప్పులు లేని మనిషి కూడా ఉండడని.. ఈ సభలో ఉన్నవారికి కూడా అప్పులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, భట్టి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. “అప్పులు లేని వాళ్ళు ఈ సభలో ఎవరైనా ఉన్నారా?” అని కేటీఆర్ ప్రశ్నించగా.. దానికి భట్టి విక్రమార్క “నాకు లేవు” అన్నారు. అందుకు కేటీఆర్ “మీరు గ్రేట్ భట్టి గారు, రాష్ట్రానికి ఆర్థికమంత్రి కదా అలాగే ఉండాలి..” అనడంతో సభలో కొద్దిసేపు నవ్వులు విరిసాయి.