Mahaa Daily Exclusive

  హెచ్‌సీయూలో హై టెన్షన్ విద్యార్థుల ఆందోళన లాఠీలకు పని చెప్పిన పోలీసులు..!

Share

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలు భూమి వేలంపై తీవ్ర వివాదం నెలకొంది. యూనివర్సిటీలో ఉన్న ఈ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 27 లోని 400 ఎకరాల భూముల వేలాన్ని ఆపాలంటూ హెచ్ సీయూ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కొన్ని గుంట నక్కలు చేరాయని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీనిపై హెచ్ సీయూ విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రాత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. రాత్రి నుండి యూనివర్సిటీ లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

ఆదివారం ఉదయం విద్యార్థులు మరోసారి తమ నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా విద్యార్థులు ముందుకు సాగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని విద్యార్థులు ఆరోపించారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని వెంటనే ఆపాలని, ఇక్కడ అనేక జీవజాతులు, వృక్ష సంపద, వైవిధ్యమైన రాళ్లు ఉన్నాయని అన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన గచ్చిబౌలి సీఐ, ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తరఫు న్యాయవాదులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

శనివారం పలు ప్రాంతాల్లో జేసీబీలతో చెట్లను నరికి వేస్తున్నట్లు గమనించిన విద్యార్థులు ర్యాలీగా వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను “గుంట నక్కలు”గా వర్ణించిన రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలపై విద్యార్థులు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని, భేషరతుగా క్షమాపణ చెప్పి, హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.