Mahaa Daily Exclusive

  సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి కేరళకు చెందిన ఎంఎ బేబికి అవకాశం…!

Share

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతితో ఆయనకు ఈ పదవి దక్కింది. చూరి మరణానంతరం నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్‌ వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలో 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన కేంద్ర కమిటీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని, అలాగే 18 మందితో పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అయితే ఈ కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి రేసులో సీనియర్ నేతలైన ఎం.ఎ.బేబీతో పాటు అశోక్‌ ధవలే, మహమ్మద్‌ సలీం, బి.వి.రాఘవులు, బృందా కారాట్‌ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఆ పార్టీలో ఓ వర్గం ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడైన అశోక్ ధవలేకు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా.. 1954లో కేరళలోని ప్రాక్కుళంలో ఎం.ఎ బేబీ జన్మించారు. ఈయన తల్లిదండ్రులు పి.ఎం.అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ . బేబీ విద్యార్థి దశలో ఉన్నప్పడే కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఇప్పుడు ఎస్ఎఫ్ఐ)లో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కేరళ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2012 నుంచి సీపీఎం పొటిల్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.