Mahaa Daily Exclusive

  హైకోర్టు తీర్పు హర్షణీయం బాధితులకు న్యాయం జరిగింది ట్విన్ బ్లాస్ట్ నిందితులకు ఉరి శిక్షపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!

Share

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పు పట్ల కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందని చెప్పారు. 12 ఏళ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని కిషన్ రెడ్డి మాటిచ్చారు.

ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాని కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జీరో టాలరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో ఇలాంటి ఘటనలకు తావు లేదని తేల్చిచెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలు ఏ మాత్రం ప్రోత్సహించకూడదని.. ఈ విషయాన్ని అన్ని రాజకీయపార్టీలు గుర్తుంచుకోవాలని సూచించారు. జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించిందని చెప్పారు. ఈ పేలుళ్ల సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. దేశ భద్రత కోసం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మరింత కఠిన చర్యలు ప్రభుత్వాలు అవలంబించాలని కిషన్‌రెడ్డి కోరారు.