తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే , బీజేపీ పొత్తు ఖరారైంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. తమిళనాడు పర్యటనలో ఉన్న అమిత్ షా.. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు. అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలైతో కలిసి మీడియాతో ముచ్చటించారు. పళనిస్వామి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. అంతేకాకుండా కనీస ఉమ్మడి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని అమిత్ షా తెలిపారు. 1998లో లోక్సభ ఎన్నికల సమయంలో అప్పటి సీఎం జయలలిత నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని సాధించామని షా గుర్తు చేశారు. బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి 39 లోక్సభ స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకుందని అన్నారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. పొత్తు కోసం అన్నాడీఎంకే ఎలాంటి డిమాండ్లు, షరతలు పెట్టలేదని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదన్నారు. అమిత్ షా ప్రజలను అభ్యర్థిస్తూ.. కొన్ని విషయాలను బీజేపీ స్వయంగా నిర్వహించుకోవడానికి అనుమతించాలని అన్నారు. అన్నాడీఎంకే పై అధిక భారం మోపవద్దని కోరారు. తమిళనాడులో డీఎంకే అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తీసుకొస్తోందని అమిత్ షా విమర్శించారు.
బీజేపీ తమిళనాడు చీఫ్ గా నాగేంద్రన్
మరోవైపు, తమిళనాడు కొత్త చీఫ్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నైనార్ నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఈసారి ఉండబోనని అన్నామలై ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆ పదవికి తిరునల్వేలి బీజేపీ ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. టి.నగర్లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి విచ్చేసి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలుచేశారు. దీంతో, ఆయన ఎన్నిక లాంఛనమేనని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి నాగేంద్రన్ పేరును కె.అన్నామలై, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్తో పాటు, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ప్రతిపాదించారు. తమిళనాడు బిజెపి చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నన నైనార్ నాగేంద్రన్ 2001, 2011లో అన్నాడీఎంకే తరఫున తిరునెల్వేలి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత 2017లో ఆయన అన్నాడీఎంకేను వీడి బీజేపీలో చేరారు.








