ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందులు చల్లారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పాఠశాలలోని వంట గదికి సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లారు. సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో దుర్వాసన, నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల హెడ్ మాస్టర్, సిబ్బంది చుట్టుపక్కల చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే తాగు నీటి ట్యాంక్లోనూ పురుగుల మందు కలిపినట్లుగా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.








