మరోసారి పాకిస్థాన్ను ఓడించాలి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్లో కలపాలి. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు జరపాలి. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఉగ్రదాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి క్రిష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మేయర్ విజయలక్ష్మి, విజయశాంతి, వంశీచంద్ రెడ్డి, భారత్ సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు.
140 కోట్లమంది ఏకమై పోరు
మొత్తం 140 కోట్ల మంది ప్రజలు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లోకి చొచ్చుకొచ్చి.. పాక్ ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది ప్రజలు ప్రధాని వెంట ఉంటారు. ఈ విషయంలో మోదీకి మద్దతు తెలుపుతున్నా. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. 1971లో పాకిస్థాన్కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీని దుర్గామాతతో వాజ్పేయీ పోల్చారు. మరోసారి పాకిస్థాన్ను ఓడించాలి. పీవోకేను భారత్లో కలపాలి. ఇందిరాగాంధీని గుర్తుకుతెచ్చుకొని పాక్కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. అభివృద్ధి పథంలో నడుస్తున్న భారత్పై ఉగ్రదాడి జరిగింది. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు జరపాలి. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఉగ్రదాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలి’’ అని అన్నారు.








