Mahaa Daily Exclusive

  ప్రతి కుటుంబాన్ని అండగా ఉంటాం.. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద రూ.1070 కోట్ల ఆర్థిక సహాయం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…!

Share

కూసుమంచి, ఏప్రిల్ -30, మహా:

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామినిచ్చారు. రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రూ.1070 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి, కూసుమంచి క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 23 లక్షల 33 వేల రూపాయలు, 35 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ఆనాడు పాలించిన పాలకులు 10 సంవత్సరాలలో వైద్యం పట్ల ఎప్పుడూ మనం ఇచ్చిన నిధులు ఇవ్వలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ క్రింద సుమారు 1070 కోట్ల రూపాయలను పేదల వైద్య ఖర్చుల నిమిత్తం పంపిణీ చేశామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రిలీఫ్ ఫండ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద పేద కుటుంబానికి కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు పరిమితిని 10 లక్షలకు పెంచామని అన్నారు. పేదల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం సరఫరా, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 71 మంది లబ్ధిదారులకు 23 లక్షల 33 వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను, కళ్యాణలక్ష్మి పథకం క్రింద 35 మంది లబ్ధిదారులకు లక్ష 116 రూపాయల చొప్పున చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, కూసుమంచి మండల ఇంచార్జ్ తహసీల్దార్ కరుణశ్రీ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.