మహా: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారి స్పందించింది. ఈ మేరకు సోమవారం సంచలన లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. ఆ లేఖలో నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు దారి తీసిన కారణాల్ని అందులో పేర్కొన్నారు. ‘లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్ జరిగింది. 6 నెలలుగా కేశవరావు మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు. కేశవరావు టీమ్లో ఉన్న ఆరుగురు ఇటీవలే లొంగిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్. యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశ ద్రోహిగా మారాడు. రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతో ఈ ఎన్ కౌంటర్. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టి ముట్టాయి. 10 గంటల్లో ఐదు ఎన్ కౌంటర్లు జరిపాయి. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భందించాయి. కేశవరావుని కాపాడుకునేందుకు 35మంది ప్రాణాల్ని అడ్డుపెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు సురక్షింతంగా బయటపడ్డారు. నంబాలను సజీవంగా పట్టుకుని ఎన్ కౌంటర్ చేశారు.
విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు..
మమ్మల్ని వదిలి కేశవరావును సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. నాయకత్వాన్ని ముందుండి మాతోటే నడిచారు. ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. మా నాయకుడిని కాపాడు కోవడంలో మేం విఫలమయ్యాం. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మరో మృతదేహాన్ని మేం తీసుకెళ్లాం. దాయాది పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం.. తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆ లేఖలో అసహనం వ్యక్తం చేశారు. పాకిస్థాన్తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం, తమతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదని మావోయిస్టు స్పెషల్ కమిటీ ఆరోపించింది.








